Sunday, November 25, 2012

BOOK REVIEW Part - II

'కార్మికగీతం'
సౌలభ్యం కోసం - వలస కాలాన్ని మొదటి దశగానూ, స్వతంత్రం వచ్చాక జరిగిన ప్రభుత్వరంగ అభివృద్ధిని, దాని వెన్నంటి వచ్చిన స్థానిక పెట్టుబడిని రెండో దశ గానూ, ఆర్థిక సంస్కరణల తరువాత వచ్చిన పరిణామాలను మూడో దశగానూ భావిస్తే, 'కార్మికగీతం' నవల రెండో దశకి చెందుతుంది. అందుచేత ఈ సంధి దశను మరింత వివరంగా పరిశీలించడం అవసరం.మొదటి దశలో వలస పాలికుల ఆశీస్సులతో  పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టినస్థానిక వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు రిస్కు లేకుండా, నష్టం లేకుండా -తామరతంపరగా ఉన్న తమ కుటుంబసభ్యుల,కులస్థుల సహకారాలతో తమవ్యాపారాల్నిసాగించడం,  క్రమేపి ఏదో ఒక ప్రదేశంలో, ఉత్పత్తిలోగుత్తాధిపత్యాన్ని సాధించడం ప్రధాన లక్ష్యంగా ఉండింది. అందుచేత స్వల్పకాలిక లాభాలు, ఇందుకు గాను ఉత్పత్తి పైనే కాక (సక్రమ లేదా అక్రమ) నిల్వలు, పంపిణీ వ్యవస్థ పైన కూడాదృష్టి, పోటీలేని వాతావరణం, పాలకులతో ఇచ్చిపుచ్చుకోవడాలు, ఉత్పత్తికన్నా కూడా బ్యాంకులు, రుణాలు, వడ్డీలు, ఇతర ఆర్ధిక లావాదేవీలపై, సర్దుబాట్లపై ఎక్కువ సమయం వెచ్చించడం, రెండేసి రకాల సమాంతర జమ-ఖర్చులు (అకౌంట్లు)నిర్వహిచడం- వారి వ్యాపార లక్షణాలు. ఇప్పుడు దేశంలో అందరికీ సుపరిచితం అయిపోయిన "నెంబర్ టూ ఎకౌంటు" సృష్టికర్తలు వీరే.రెండవదశలో పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాకకూడా వారిలో ఇదే వైఖరి కొనసాగింది.అందువలన పెట్టుబడిదారీ విధానం తెచ్చిపెట్టే క్రమశిక్షణ,  పద్ధతులు అంటే -అనిశ్చిత; పోటీ; జమ-ఖర్చులు, లాభాలు, పన్నుల విషయంలో పారదర్శకత;ముఖ్యంగాశ్రామికవర్గంతో చర్చలు, సంప్రదింపులు- ఇవేవీ వారికి బొత్తిగా రుచించలేదు.అనవసరమైన తలకాయ నెప్పుల మాదిరిగా అగుపించాయి. బ్రిటీష్ కంపెనీల వ్యాపారపద్ధతులను తొందరగా ఆకళింపు చేసుకున్న పార్సీలను మినహాయిస్తే - ఒక ఆధునికరాజ్యంలో (ముఖ్యంగా స్వతంత్రం వచ్చాక)  వ్యాపారాలను, పరిశ్రమలను ఎలా నిర్వహించాలనేది స్థానికులకు, మొదటితరం పెట్టుబడిదారులకు ఒక అడ్డంకిగా, గుదిబండగా మారింది. ఈ క్రమంలోనే బొంబాయి నగరం, కలకత్తాను అధిగమించి ఆధునిక పారిశ్రామిక కేంద్రంగా ముందుకి సాగింది.
బొంబాయి, కలకత్తాల మాట ఎలా ఉన్నా, అప్పుడే వెలుస్తూన్న(హైదరాబాదు వంటి) స్థానికపారిశ్రామిక కేంద్రాల్లో పెట్టుబడి ఆవరణలో కూడా భూస్వామ్య సంబంధాలే కొనసాగాయి. నిజానికి బలపడ్డాయి. 'కార్మికగీతం'లో పేర్కొన్నట్లు - 'సార్' అనే కిందివాడిని'బే' అనడం, 'బే' అనే పైవాడిని'సార్' అనడం, కార్మికులుయజమానితో  'కాల్మొక్కుత' అనడంకొనసాగింది.పెత్తనం, అధికారం - అవిప్రయోగింపబడే వివిధ స్థాయిలూ యాజమాన్య విధానాల్లో భాగం అయ్యాయి. అదే హైదరాబాదులో నేడు (ఐటి కంపెనీలలో) జీ ఏం లనూ, వైస్-ప్రెసిడెంట్ లను కొత్తగాచేరిన ఇంజినీర్లు కూడా 'సార్' అనకుండాపేరుపెట్టి సంబోధించడంచూస్తున్నాం.కార్మికులు, మేనేజర్ల మధ్య మాత్రం ఇది ఇప్పటికీ సాధ్యం కాలేదు.
పెట్టుబడిదారీ వ్యవస్థలో కూడా భూస్వామ్య ఆచరణ, భావజాలాల కొనసాగింపు అనే నిర్దిష్ట దౌర్భాగ్యం మన దేశపు అభివృద్ధికి అన్ని రకాలుగానూ అడ్డుపడింది; పడుతోంది.ప్రతిభావంతుల్ని అణగ దొక్కుతూ, నైపుణ్యం- సృజనాత్మకతలను తొక్కిపెడుతూ,  వేరేవ్వర్ నీనోరేత్త నివ్వకుండా, బానిసత్వాన్ని, వినయ విధేయతలని, వ్యక్తిగతంగా రుణపడి ఉండడాన్నిసదా డిమాండ్ చేసే సంస్థాగత భూస్వామ్య పద్ధతులమూలంగా ఎన్నోగొప్ప అవకాశాలను మన సమాజం పోగొట్టుకున్నది.దీనికి తోడు చేతులతో పనిచేసేవాడికి శాస్త్రజ్ఞానం అందుబాటులో ఉండదు; చదువుకున్నవాడు చేతికి మట్టి (లేదా గ్రీసు)అంటుకోవడానికి సుముఖంగా ఉండడు. దీని పునాదులు మన కుల వ్యవస్థలో ఉన్నాయనడానికి ఎట్టి సందేహమూ అక్ఖర్లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అభ్యుదయకర లక్షణాలను ఈ విధంగా కోల్పోయాం; భూస్వామ్య, పెట్టుబడిదారీ వ్యవస్థల రెండింటి అవలక్షణాలూ మనకు ఏకకాలంలో సంక్రమించాయి. ఇది ఇలా కొనసాగుతూఉండగానే ప్రపంచీకరణ అనే తాటిపండు మన నెత్తిన పడింది. ప్రస్తుతం మనసమాజంలో  నెలకొనిఉన్న గందరగోళపు మూలాలు ఇక్కడఉన్నాయి.
ప్రతిభావంతులైన శ్రామికులు, దళితులూ, గిరిజనులూ వ్యవస్థ విధించే పరిమితులను అధిగమించి - ఏ విధమైన పారితోషికమూ,గుర్తింపూ లేకపోయినా - అద్భుతమైన సాధనాలను సృష్టిస్తూనే ఉంటారు. చుట్టుపక్కల వారిని అబ్బుర పరుస్తారు. (తరచూ వారికృషిని వేరే వాళ్ళు తన్నుకుపోతారు; పేటెంట్లు సంపాదించుకుంటారు. సాధనాలు, పద్ధతులు టెక్నాలజీలుగా మారి మన చేతికివస్తాయి). ఇది వారి విషాదభరితమైన విజయం. 'కార్మికగీతం'లోయాదగిరి అనే కార్మికుడు కంప్రెసర్ యంత్రాన్నిసృష్టించడం ఇందుకొక గొప్ప ఉదాహరణ.పనంటే ప్రాణం పెట్టి కంపెనీకిఎంతో లాభం చేకూర్చిన యాదగిరి లాంటి కార్మికుల చొరవని యాజమాన్యం వినియోగించుకుంటుంది గాని గుర్తించదు; పైగా వెనక్కి నెడుతుంది. మేనేజరు మాత్రం ముందు వరసలో నిలబడి  పొగడ్తలు అందుకుంటాడు.విదేశీమారకం కొరతగా ఉండిన లైసెన్స్-పెర్మిట్ రాజ్ లో ఉత్పత్తిని పెంచుకొనేందుకు తక్కువ వ్యవధియంత్రాలని దిగుమతి చేసుకోవడం అసాధ్యం.అలాంటప్పుడు యాదగిరి రాత్రింబవళ్ళు కష్టించి అతి తక్కువ ఖర్చుతోనే కంప్రెసర్ని సృష్టిస్తాడు.విచిత్రం ఏమిటంటే ఉత్పత్తిలో పెంపుదలనీ, ఖర్చులో మిగులునీ యాజమాన్యం గుర్తిస్తుందిగానీ - కొత్త యంత్రాలను, టెక్నాలజీని సృష్టించగల సామర్ధ్యతను గణనలోకి తీసుకోదు; ఈ సామర్ధ్యాన్ని పెంచుకొనే దిశలో కృషి చెయ్యదు.ముందు చూపులేని పారిశ్రామిక వేత్తలు స్వల్పకాలిక లాభాలపై పెట్టే పరిమితమైనవ్యాపార దృష్టికి ఇదొక నిదర్శనం. నిజానికి ఈ విధమైన 'రివర్స్ఇంజినీరింగ్-అంటే దిగుమతి చేసుకున్న యంత్రాలను విప్పదీసి (మొదట్లో వాటి వెనక ఉన్నశాస్త్ర జ్ఞానాన్ని పూర్తిగాగ్రహించలేక పోయినా), కాపీ కొట్టి, వాటినే తక్కువ ధరలకు పెద్ద ఎత్తున తయారు చెయ్యడం, ఎగుమతి చెయ్యడం - ద్వారానే జపాన్, కొరియా, చైనాలు తమ తమ పారిశ్రామికీకరణలను వేగవంతం చేసాయి. ఇవేవీ తెలియని యాదగిరి, తన కంప్రెసర్ ను స్వంతబిడ్డలా చూసుకొని, స్వయంగా రంగుపూసి ముచ్చటపడతాడు; కావలించుకొని ఏడ్చేస్తాడు.
ఉద్యోగుల పట్ల,పర్యావరణం పట్ల పూర్తిగా బాధ్యతా రహితంగా వ్యవహరించే యాజమాన్యం మొదటి, రెండో దశలకు అద్దంపట్టే లక్షణం. పరిమితుల్లేని దురాశ దీని ప్రధాన చోదకశక్తి. కార్మికుల పట్ల సాగిన మొదటి దశనాటి క్రూరమైన దోపిడీ రెండోదశలోనూ దర్శనమిస్తుంది. అయితే అది అసంఘటిత శ్రమశక్తిపైన మాత్రమే ప్రయోగించబడింది. ప్రభుత్వ రంగానికి చెందిన కార్మికులూ, ఇతర (పెద్ద ప్రైవేటు రంగ) సంఘటిత కార్మికులూ ఈ దుర్భర పరిస్థితుల్ని తప్పించుకోగలిగారు. ఇందుకు ప్రధాన కారణం - తొలినాటి వామపక్ష యూనియన్లుస్వతంత్రకాలం నాటి రాజ్యాంగం, చట్టాలూ, అవి ప్రసాదించిన హక్కులూ,వాటిని అమలుచేసేందుకు సృష్టించబడిన ప్రభుత్వ యంత్రాంగం, విభాగాలు, లేబర్ కోర్టులూ, వగైరా. అయితే ఇవన్నీ తమ జోలికి రాకుండా ఉండేందుకు, వచ్చినా వాటిని నిర్వీర్యం చేసేందుకు ప్రైవేటురంగ యాజమాన్యాలు విశ్వప్రయత్నం చేసాయి.
అసమర్థ ప్రభుత్వ రంగపు చలవతోబాటు, అవినీతిపరులైన ప్రభుత్వాధికారుల, విభాగాల సహకారం రెండో దశనాటి స్థానిక పెట్టుబడికి ఎంతగానో ఉపయోగపడ్డాయని 'కార్మికగీతం' నవల స్పష్టం చేస్తుంది. చట్టాలను అతిక్రమించే యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం అంటే తమ లంచాలను మరింతపెంచుకొనేందుకు ముందస్తు ఏర్పాటు చేసుకోవడమే అని - జీయంగోపాలక్రిష్ణకీ, లేబర్ ఇన్స్పెక్టర్ కీ ఒక సాయింత్రం పూట బార్ లో జరిగిన సమావేశంలో స్పష్టం అవుతుంది.
కే సి ఇండస్ట్రీస్ యజమాని చక్రవర్తి మహా మేధావి గనక వేరే వాళ్ళు కాకుండా, తామే స్వయంగా కార్మికులకు యూనియన్ ఏర్పరచవచ్చని సూచిస్తాడు; అమలు చేయిస్తాడు. చక్రవర్తి చాలా ముందు చూపు ఉన్న యజమాని. "కార్మికులు ఇవాళ గురించి ఆలోచిస్తే మనం రేపటి గురించి ఆలోచించాలి. వాళ్ళు యూనియన్ గురించి ఆలోచిస్తే మనం ఆ లీడర్ గురించి ఆలోచించాలి". శివకృష్ణ అనే వ్యక్తిని నాయకుడిగా పైనుండి  తీసుకొచ్చి కార్మికుల్ని కొన్నాళ్ళబాటు చెప్పుచేతల్లో పెట్టుకున్న యాజమాన్యం, తమ కుయుక్తుల్నీ, శివకృష్ణ రెండు నాల్కుల్నీ పసిగట్టిన చాకుల్లాంటి కార్మికులు (వెంకటేశ్వరరావు) కంపెనీలో ఉండకుండా చెయ్యగలుగుతుంది. హెచ్చేస్సారేం మేనేజర్లకు యూనియన్లంటే భయం, కంపరం. 'అవిఏర్పడకుండా చూడ్డంతోనే (జీ ఎం)గోపాలక్రిష్ణకి తలపండిపోయింది'.తీరా ఏర్పడితే ఎలా నెట్టుకురావాలోతెలియదు.
పారిశ్రామీకరణకు అత్యవసరమైన శాస్త్రజ్ఞానం, నైపుణ్యం - అటు గ్రామాలనుండి కొత్తగా పొట్టచేతబట్టుకొని వచ్చినకార్మికుల్లోనూ,ఇటు ఆచరణకు దూరమైన చదువులు చదివి అప్పుడే ఉద్యోగంలో చేరిన ఇంజినీర్లలోనూ లోపిస్తాయి. ఎక్కడో తప్పించి ప్రైవేటురంగ సంస్థలు శిక్షణ పైన ఖర్చు పెట్టేందుకు ముందుకిరావు. పనిచేస్తూనే నేర్చుకోమంటాయి; తప్పులుచేస్తే మాత్రం ఊరుకోవు. కొలువులోంచి తీసేస్తాయి. మేనల్లుడు (కంప్రెసర్)యాదగిరిని ఒకానొకప్పుడు - తన కంపెనీలో కాకుండా మొదట ఓ చిన్నవర్కుషాపులో బాలకార్మికుడిగా పనిలోపెడుతూ మల్లేష్ అంటాడు:"కంపెన్ల పెద్ద పెద్దసదువులోచ్చినోల్లుంటారు గానీ పనొచ్చినోళ్ళు తక్వ.....పుస్తకం లేకుంట మెషిన్ తో కూడా పనిచేయించలేడు. ఇంగ అల్లేమి నేర్పుతరు పని". శిక్షణ, అనుభవం, సాధనాలు లేక ప్రమాదాలు ఎక్కువవుతాయి.చిన్న గాయం అయినా ఫస్ట్ఎయిడ్బాక్స్లో ఏమీ ఉండవు. ఈఎస్ఐ హాస్పటల్కు పోతే పట్టించుకునే వారుండరు. అడిగితే పనిలోంచి తీసేస్తారనే బెదిరింపు.కార్మికుల్లో అభద్రతాభావాన్ని, ముఠాలని సృష్టించి తమ ఆధిపత్యాన్ని కొనసాగించే యాజమాన్యం - ఇవన్నీ ఈ నవలలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
లుంపెన్ నేపధ్యంతో, గూండాగా ఎదిగి యూనియన్ రాజకీయాల్లో చేరిన అమీరుద్దీన్ ఈ నవలలోని అత్యంత పరిపూర్ణ,సజీవపాత్రగాపాఠకుల ముందు నిలుస్తాడు –బడబడలాడుతూ -తన మోటార్ సైకిల్తో సహా. ఒక ప్రభుత్వ సంస్థలోఉద్యోగిగాఎప్పుడూ పనికి వెళ్ళకుండా జీతం మాత్రం తీసుకుంటూ అనేక యూనియన్లకు నాయకుడిగా, స్థానిక దాదాగా పేరుపొందిన అమీరుద్దీన్ వల్ల ఒరిగేదేమీ ఉండదని తెలిసినా తెచ్చితమ నెత్తిమీద పెట్టుకుంటారు కార్మికులు.కార్మిక నాయకత్వాన్నితనవృత్తిగా చేసుకొని, మేనేజ్మెంట్ లచలవతో, రాజకీయనాయకుల అండతో బాగా సంపాదిస్తున్నఅమీరుద్దీన్చివరికి తన తడాఖాచూపిస్తాడు. కార్మికులు  - "బయటి నాయకులెవరూ వద్దు. వాళ్ళందరూ మనబతుకుల్నితాకట్టుబెట్టి సంపాదించుకుపోతారు. మనల్ని అమ్మేస్తారు. మనలోనే మన నాయకులూ ఉండాలి" అనే అవగాహనకు వస్తారు. "వాళ్ళ జీవితాలే వాళ్ళ పాలిటజ్ఞాన గ్రంధాలయాలు". యాజమాన్యపు హింసాప్రయోగం, వారికి పోలీసుల అండ, తిరగబడ్డకార్మికులు,వారికితోడుగానిలిచిన ఇతర కార్మికుల సంఘీభావం - అందులోంచి పుట్టిన ఆశాభావంతో  నవల ముగుస్తుంది.
శివకృష్ణ, అమీరుద్దీనూ, ఎండీ, ఇతర మేనేజర్లూవిలన్లుగా బాగా రూపుదిద్దుకుంటారు. అయితే కథానాయకుడుఎవరు? కార్మికులందరిలోకీ చదువుకున్నవాడిగా, చుట్టూ జరుగుతూన్న సంఘటల్నిక్షుణ్ణంగా విశ్లేషిస్తూ చైతన్యవంతుడైన మోహన్ రావా? కార్మిక పక్షపాతి అయిన మేధావిగా నేపధ్యంలో ఉంటూనే -భూస్వామ్య వ్యవస్థ, వలసవాదం ఎలా కలసికట్టుగా ప్రజల్ని పీడిస్తున్నాయో వివరించి, అవినీతి మూలంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎలా నష్ట పోతున్నాయో, ఆనష్టాలు ప్రైవేటు సంస్థలకు లాభాలుగా ఎలా మారుతున్నాయో ఉదాహరణలతో సహా విశదీకరించి, పెట్టుబడి కూడా శ్రమశక్తికి రూపాంతరమే అనే తిరుగులేని సూత్రీకరణ చేసిన రాజగోపాల రావా,..ఇదే సందేహాన్ని తన ముందుమాటలో ప్రస్తావించిన సుధాభాస్కర్గారు ఒకే నవలలో ఎంతో మంది హీరోలను రచయత మన ముందుంచారు అంటారు.  కార్మికులందరూ ప్రధాన పాత్రలనిచెప్పడానికో, ఏ ఒక్క వ్యక్తికో  ప్రాధాన్యత కల్పించడం సమిష్టి విలువలకు విరుద్ధం అనో బహుశాకుటుంబరావుగారు భావించి ఉండవచ్చు. పాఠకులు సానుభూతితో  తమని తాము చూసుకునే పాత్ర ఏదయినా ఒకటి నవలకు కేంద్రబిందువుగా లేకపోవడం సర్వత్రాఆమోదం పొందిన నవలా ప్రక్రియకు, రచనా విధానానికీ కుటుంబరావుగారు సృష్టించిన మినహాయింపు కావచ్చు. ఇది ఒక ప్రయోగం. ఎంతో మంది కార్మికుల జీవితాలూ, వాళ్ళ మాటల్లోనే వాళ్ళ అనుభవాలూ, కష్టాలూ, హాస్యాలూ- ఇవన్నీ మనంకూడా చదివి అనుభవించినప్పుడు - ఈ ప్రయోగం విజయవంతం అయ్యిందనిపిస్తుంది.
రచయత స్వీయానుభవం నుండి పుట్టిన రచన గనుక వాస్తవికతకు అతి చేరువలో ఈ నవల నడుస్తుంది. తెలంగాణా ప్రజల భాష, హైదరాబాదు పరిసరాల్లోనిశ్రామిక వాడల నాడి ఈ నవలలోని మరో విశేషం. పాఠకులకు ఒక నిర్దిష్టప్రాంతాన్ని, జీవనాన్ని,కాలాన్ని రచయత పరిచయం చేస్తారు. ‘కార్మికగీతంనవల అసంఘటిత కార్మికులపైనే తన దృష్టిని పెడుతుంది. కానిబి.హెచ్.ఈ.ఎల్., ఐ.డీ.పీ.ఎల్. వంటి ప్రధమశ్రేణి ప్రభుత్వరంగసంస్థలూ, వాటి ప్రత్యక్ష, పరోక్ష ప్రభావం నేపధ్యంలోమెదులుతూనేఉంటాయి. సైరన్ల పిలుపులు, యంత్రాల రొద, కందెనల వాసన, వెల్డింగు మెరుపులు, ఫర్నేస్ ల వేడి, చేతికితగిలే గ్రీసు, బీడీల ఘాటు -వీటితో బొత్తిగా పరిచయంలేని వాళ్లకు కూడావీటి అనుభూతి కలిగిస్తారు కుటుంబరావుగారు.
U. Sudhakar
Hyderabad