Saturday, December 1, 2012






BOOK REVIEW Part III

సమకాలీన పరిస్థితులు
ఆర్ధిక సంస్కరణల (సు. 1990) అనంతరం దేశపు పారిశ్రామికీకరణ యొక్క వేగం, దిశ,వ్యాప్తి త్వరిత గతిన మారిపోయాయి. గడిచిన ఇరవై ఏళ్లల్లో కొన్ని ధోరణులు స్పష్టం అయ్యాయి. రెండవ దశలో ప్రముఖ పాత్ర  వహించిన పబ్లిక్ రంగ సంస్థల్లోని తమ వాటాలను అమ్ముకొని, యాజమాన్య బాధ్యతల నుండి ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. మరో వైపు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు పోటీ పడుతూ దేశ, విదేశీయ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాయి. పెట్టుబడి ఆహ్వానిస్తే రాదు; దాని లాభార్జనకు గల అవకాశాలను పెంచితేనూ, దానికి భద్రతను కల్పిస్తేనూ వస్తుంది;ఈ రెండింటిలో ఏది లోపించినా పారిపోతుంది.  పన్నుల్లో మినహాయింపులూ, రాయతీలు కల్పించడానికి అన్ని ప్రభుత్వాలు సిద్ధం ప్రకటిస్తున్నాయి. అయితే ఇంతకన్నా కష్టమైన పనులు మూడున్నాయి:రోడ్లు, నీళ్ళు, విద్యుత్ సరఫరాతోబాటు ఇతర సదుపాయాలుకల్పించడం;పెద్ద ఎత్తున, తగిన సంఖ్యలో కార్మికుల నైపుణ్యాలను పెంచడం;ముఖ్యంగా (రెండో దశలోనే పాతుకుపోయిన) పారిశ్రామిక సంబంధాలను పునర్నిర్వచించడం. ఈ మూడు విషయాల్లోనూ ఇంచుమించుగా అన్ని ప్రభుత్వాలూ చేతులెత్తేశాయి. పైగా వీటిని పెట్టుబడికి విడిచిపెడుతున్నాయి. మొదటి అంశం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యానికి, అంతులేని కుంభకోణాలకూ పునాది వేసింది. ఇక రెండో అంశానికి వస్తే కేంద్ర ప్రభుత్వం చాలా ఆలస్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నదిగాని ఫలితాలు ఇప్పట్లో రావు. మూడో విషయం పై మాత్రం ప్రైవేటురంగం తన దృష్టిని పూర్తిగా కేంద్రీకరించింది. ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తున్నది.
ఈ స్థితిలోశ్రామిక వర్గం నిర్మాణాత్మకంగా స్పందించి, తాము సాధించుకున్న వాటిని నిలబెట్టుకుంటూనే - ప్రజాహితంగా జరిగే పారిశ్రామికాభివృద్ధికీ, పెట్టుబడికీతాము వ్యతిరేకులం కాదనే సంకేతం ఇవ్వగలగాలి.'లాభం' అనేది తిట్టుమాట కాదని వామపక్షీయులు కూడా నేడు ఒప్పుకుంటున్నారు.పాతికేళ్ళ పాటు నిర్విరామంగా బెంగాల్ ని పాలించిన వామపక్ష పార్టీలు పెట్టుబడిని వెంటాడి పొలిమేరల వెలుపలకు తరిమికొట్టాయి. చివరి దశలో టాటా వారిని ఆహ్వానించినా, వారు సహకరించినా కూడా ఫలితం మాత్రం దక్క లేదు. సగం పూర్తయిన నానో ప్రాజెక్టుని గుజరాత్   ప్రభుత్వం  తన్నుకుపోయింది.పెట్టుబడికీ పారిశ్రామికీకరణకూ అత్యంత స్నేహపూరిత రాష్ట్రంగా గుజరాత్ ని చిత్రించడానికి ఈ పరిణామాలు తోడ్పడ్డాయి
అభివృద్ధిలోనూ, పారిశ్రామికీకరణలోనూ ఉన్న అసమతుల్యం కారణంగా - వివిధ రాష్ట్రాల, ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు, ఘర్షణలు మరింత ఉధృతం అయ్యే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ దిశలో వస్తూన్న కొన్ని పరిణామాలను చూస్తూనే ఉన్నాం. పారిశ్రామికీకరణకు బాహ్యంగా ఉండిపోయిన గిరిజనులు - ప్రధాన బాధితులుగా, ప్రాజెక్టుల వలన, గనుల త్రవ్వకాల మూలంగా నిర్వాసితులుగా మిగిలిపోతున్నారు. వారిలోని యువతీ యువకుల్లో ఎక్కువమంది కొద్దిపాటి చదువులవలన తమ పూర్వీకుల జీవన విధానానికి తిరిగి వెళ్ళలేక,అలాగని కొత్త జీవనాధారాలని అందుకోలేక మధ్యస్తంగా మగ్గుతున్నారు.
కార్మికవర్గ నైపుణ్యం, శిక్షణ, ఉద్యోగావకాశాల విషయంలో పురుషులకంటే స్త్రీల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఉదాహరణకి, పనికోసం గ్రామాలనుండి పట్టణాలకుతరలివచ్చే స్త్రీలు మట్టిమోసే పనిలోనే కనిపిస్తారు. వాళ్ళు ఎప్పటికీ మేస్త్రీలు కాలేరు. పైగా వంట పని, పిల్లల్ని చూసుకోవడం వారి బాధ్యతలే; లైంగిక దోపిడీ సరేసరి. ఇటీవల పురుషులలో చాలామంది సెక్యూరిటీగార్డులవుతున్నారు.ఆ పనిశ్రమకీ,ఉత్పత్తికీ ఎంతదూరంలో ఉంటుందో చెప్పనక్ఖర్లేదు. స్త్రీ పురుషులిరువురూ కూడా ఎలెక్త్రీశియన్లు, ప్లంబర్లూ, ఫిట్టర్లూ, వెల్డర్లూ, నర్సులూ, మంత్రసానులూ,  మెకానిక్కులూ, డ్రైవర్లూ,వగైరా కాగల అవకాశాలను కోల్పోతున్నారు. ఉత్పత్తిలోభాగస్వాములు కాలేక పోతున్నారు. పైగా ఇలా నగరాలకు తరలివచ్చే వారిలోనే నగరజీవనపు మెరుగుల్ని అందుకొనే ప్రయత్నంలో రెండో తరానికల్లా తాగుడు, మాదకద్రవ్యాల వాడకం, నేరస్తుల ముఠాలలో చేరడం, వేశ్యావృత్తిలోకి దిగడం - ఇటువంటి ప్రమాదకరమైన ధోరణులు చోటుచేసుకుంటున్నాయి. స్వతంత్రం వచ్చిన 60 ఏళ్ల తరవాత పబ్లిక్-ప్రైవేటు రంగాల ఉభయ నేతృత్వంలో 2022 నాటికల్లా28 పారిశ్రామిక రంగాలలో 50 కోట్లమంది  నిపుణులైన కార్మికుల్ని, టెక్నీషియన్లనీ తయారు చేయ్యాలనే బృహత్తర ఆశయంతో 'నేషనల్ స్కిల్డెవలప్మెంట్ కార్పోరేషన్' ని నెలకొల్పడం జరిగింది. ఇల్లంటుకున్నాక నుయ్య తవ్వడం అంటే ఇదే. 
గ్లోబలైజేషన్ తరవాత ప్రపంచపు నలు మూలలనుండీ పెట్టుబడి మన దేశానికి యధేచ్చగా వస్తోంది, పోతోంది. కాని మానవవనరులకు మాత్రం ఆ స్వేచ్ఛ లోపించింది. పని కోసం విదేశాలకు పోవాలంటే వీసాలు, వర్క్ పెర్మిట్లు అడ్డు పడినంత కాలం, సహజ వనరులపై గుత్తాధిపత్యం కొనసాగినంత కాలం, అది నిజమైన ప్రపంచీకరణ కాజాలదు. మౌలిక సదుపాయాల్లో, కార్మికులనైపుణ్యంలో ఉన్న తీవ్రమైన లోటు వలన పెట్టుబడి కొన్ని రంగాలకు పరిమితం అవుతోంది. ఉద్యోగావకాశాలపెంపునకు సంబంధించి ఇదెంతమాత్రం ఆరోగ్యకరం కాదు.
ముగింపు
కార్మికగీతం' నవల చివరిలో మేడే నాడు రాజగోపాలరావు తన ఉపన్యాసంలో స్వంత ఆస్తి పోయి అది సమాజ పరంకావాలంటాడు.ఉత్పత్తి సాధనాలన్నింటినీ శ్రామిక వర్గం స్వాధీనం చేసుకోవాలంటాడు. నవలా కాలం నాటికింకా సోవియట్ యూనియన్, తూర్పు యూరపు దేశాలూ కుప్పకూలిపోలేదు. చైనాలో రాజ్యం సృష్టించిన, ఏ హక్కులూ లేనిపెట్టుబడిదారీ విధానపు వికృత రూపం ఇంకా రూపు దిద్దుకోలేదు. కాంబోడియాలోఅస్థిపంజరాలు బయట పడలేదు. అందుచేత అప్పటికదే ఆదర్శం, ఆశాకిరణం. రష్యా, చైనాల మార్గాలు మన మార్గాలు కానేరవు అనేది మాత్రం ఇప్పుడు స్పష్టం. మనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్య సంస్థల్నిశక్తివంతంగా వినియోగించగలగడమొక్కటే మార్గం.పశ్చిమయూరోపు, స్కాండినేవియా దేశాల్లో పెట్టుబడి-కార్మికవర్గంమధ్య విభేదాలు సామరస్యం గానే పరిష్కరించ బడ్డాయి. అక్కడి ప్రభుత్వాలు, యాజమాన్యం, అలాగే యూనియన్లూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు.సాంఘిక సంక్షేమపథకాలు, ప్రజాస్వామ్య సంస్థలూ బలంగా ఉన్నాయి. గూండాల దౌర్జన్యంలేదు. అక్కడి మోడల్ లో మనకు పనికివచ్చేఅంశాలు ఉన్నాయి. 
అయితేఏ దేశంలోనైనాఅన్ని యాజమాన్యాలూ కార్మికుల పట్ల, పర్యావరణం పట్ల పూర్తిస్వచ్చంద బాధ్యత కలిగి ఉంటాయనుకుంటే అది ఉత్తి భ్రమే అవుతుంది.  విద్యావ్యాప్తి, సమాచార హక్కు, ఉన్నంతలో స్వేచ్చ కలిగిన మీడియా, ప్రాధమికహక్కులూ, కోర్టులూ - వీటి మూలంగా చాలా ఇతర దేశాల్లో లేనంత మేరకు అర్థవంతమైన చర్చ జరిగేఅవకాశం మనకున్నది. దురాశనూ, దోపిడినీ నియంత్రించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా  ఉద్యోగులనూ, శ్రామికులనూ సంస్థల్లో భాగస్వాములను చేసే ఆస్కారం ఉన్నది. ఒకమేరకు ఇది జరుగుతున్నది కూడా. ప్రాజెక్టుల మూలంగా నిర్వాసితులైన వారినికూడా (డబ్బు రూపంలో పరిహారం చెల్లించే బదులు)వాటాదారులను చేస్తే భూసేకరణ విజయవంతం కావచ్చు.
ఇప్పుడు కుటుంబరావు గారు గనక కార్మికగీతపు రెండో భాగం రాస్తే - అందులో పెట్టుబడిఎత్తిన కొత్త అవతారాలేకాకుండాస్త్రీల, దళితుల, గిరిజనుల శ్రమ శక్తి, ప్రాంతీయ అసమానతలు, కొత్త మధ్యతరగతి - రంగం మీదకు వస్తాయి.బహుశా పర్యావరణం గూర్చిన చర్చ కూడా వచ్చి చేరుతుంది.రాజగోపాల రావు సూత్రీకరించినట్టు పెట్టుబడి కూడా శ్రమకు మరోరూపం.పెట్టుబడినిజవాబుదారీగానూ, శ్రమను చైతన్యవంతం అయిన భాగస్వామి గానూ, శ్రామికులనూ, సామాన్యులనూ వాటాదార్లుగానూచెయ్యగలిగితేఇకమిగిలే లక్ష్యం:సహజ వనరుల్ని, భూమండలాన్ని కాపాడుకోవడం; అంతేగాని వనరుల్నిహస్తగతం చేసుకోవడం, అధికారం చెలాయించడం, పెత్తనం చెయ్యడం కాదు -అది  ఏ వర్గం, సమూహం తరఫున అయినా, ఏ మహా సిద్ధాంతం పేరున అయినా.  అప్పుడే మనుషులంతా ఒక ప్రపంచాన్ని గెలుచుకుంటారు.
- ఉణుదుర్తి సుధాకర్, 14సెప్టెంబరు 2012

No comments: